||సుందరకాండ ||

||ఏబది ఐదవ సర్గ తెలుగులో||


|| Om tat sat ||

||ఓమ్ తత్ సత్||
శ్లో|| లంకాం సమస్తాం సందీప్య లాంగులాగ్నిం మహాబలః|
నిర్వాపయామాస తదా సముద్రే హరిసత్తమః||1||
స|| మహాబలః హరిసత్తమః లంకాం సమస్తాం సందీప్య తదా సముద్రే లాంగూలాగ్నిం నిర్వాపయామాస||
తా|| ఆ మహాబలుడు హరి సత్తముడు అయిన హనుమంతుడు లంకానగరము అంతయూ అగ్నిజ్వాలలతో నింపి తన లాంగూలము చివరలోనున్న అగ్నిని సముద్రములో ముంచి చల్లార్చెను.
||ఓమ్ తత్ సత్||

సుందరకాండ.
అథ పంచపంచాశస్సర్గః||

ఆ మహాబలుడు హరి సత్తముడు అయిన హనుమంతుడు లంకానగరము అంతయూ అగ్నిజ్వాలలతో, నింపి తన లాంగూలము చివరలోనున్న అగ్ని ని సముద్రములో ముంచి చల్లార్చెను. ఆ అగ్నిజ్వాలలో మండుతున్న ధ్వంసము చేయబడిన లంకానగరము చూచుచూ హనుమంతుడు అలోచించ సాగెను.

అప్పుడు ఆయనకి మహత్తరమైన భయము కలిగెను.

తనపై తనకే ఏవగింపు కలిగెను. 'లంకను దహించి నేను ఏమి చేసితిని. ఎవరైతే పైకి లేచిన అగ్నిని నీటితో చల్లార్చినట్లు, పైకి లేచిన క్రోధమును తమ బుద్ధితో అదుపులోకి తీసుకు రాగలరో వారు మహత్ములు. వారు పురుషులలో శ్రేష్టుಲು. కోపముకలవాడు ఏమి చేయడు? కృద్ధుడు గురువులను కూడా హతమార్చకలడు. కృద్ధనరుడు పరుషవాచములతో సాధువులను కూడా ఆక్షేపించును. ప్రకోపించినవాడు మాట్లాడని మాట్లాడకూడని మాటల విచక్షణాజ్ఞానము కోల్పోతాడు. వానికి మాట్లాడకూడని మాట వుండదు. చేయతగని పని వుండదు. పాము తన కుబసము విడిచినట్లు ఎవరైతే లేచిన తన క్రోధమును క్షమతో విడవగలడో వాడే పురుషోత్తముడు'.

'ఆ సీతను గురించి అలోచించకుండా లంకను అగ్నికి ఆహుతి చేసి, సిగ్గులేకుండా దుర్బుద్ధి కలవాని లాగ, స్వామి ఘాతకము చేసినవాడనైతిని. ఈ లంకా పూర్తి గా దహనమైతే అర్యురాలగు జానకి కూడా దగ్ధమైపోయి ఉండును. అనాలోచనతో స్వామి కార్యము భంగపరిచితిని. దేని కోసమై ఈ కార్యము ఆరంభింపబడెనో, ఆకార్యమును భంగపరిచితిని. లంకను దహించితిని కాని సీతను రక్షింపలేదు. ఏ కార్యముకొఱకై వచ్చితినో ఆ కార్యము సఫలము అగు సమయములో, క్రోధములో మూల కార్యమునకే ముప్పు తెచ్చితిని. తప్పక సీత నాశనమై ఉండును. లంకలో దగ్ధము కాని ప్రదేశము కనపడుట లేదు. నగరమంతయూ దగ్దమైనది.'

'నా ప్రజ్ఞ విఫలమై అందువలన ప్రభు కార్యము చెడిపోయినచో, నేను ఇక్కడే ప్రాణత్యాగము చేయుట సముచితమని తోచుచున్నది. నేను ఇప్పుడే అగ్నిలో దూకి ప్రాణత్యాగము చేయనా ఏమి? ఈ బడబాగ్నిలో దూకనా? ఈ శరీరమును సాగరవాసినలైన జలచరములకు ఆహారముగా సమర్పించెదను. కార్యమునంతయూ నాశనము చేసిన నేను జీవిస్తూ హరీశ్వరుడగు సుగ్రీవుని చూచుట ఎట్లు? పురుష శార్దూలురగు వారిద్దరిని ఎట్లు చూచెదను? నా రోషదోషముతో మూడు లోకములలో ప్రసిద్ధమైన వానరుల చపలత్వమును ఋజువు చేశాను కదా !'

'ఛీ ! ఈ రజోగుణము అదుపులేని చపలత్వమును కలిగించును. నిగ్రహించుకోగలనప్పటికీ, నేను నా క్రోధముతో సీతను రక్షించుకో లేకపోయాను. సీత నష్టపోయినచో వారు ఇద్దరూ మరణించెదరు. వారు ఇద్దరి మరణముతో, బంధువులతో కూడా సుగ్రీవుడు మరణించును. ఈ మాటలను విని భ్రాతువత్సలుడగు భరతుడు ధర్మాత్నుడైన శతృఘ్నునితో సహా ఎట్లు జీవించును? ధర్మాచరణబద్ధులైన ఇక్ష్వాకు వంశము నశించితే అసంశయముగా ప్రజలందరూ శోకసంతాపములతో పీడింపబడుదురు. భాగ్యరహితుడనై ధర్మార్థములను కోల్పోయి నేను ఈ లోకనాశనమునకు కారణమైనవాడను అగుదును'.

ఈ విధముగా ఆలోచించుచున్న ఆ వానరునకు పూర్వములో జరిగినట్లు శుభసూచనలు మరల కాన వచ్చాయి. అప్పుడు ఆ వానరుడు మరల ఆలోచనలో పడెను. 'బహుశ ఆ మంగళప్రదురాలైన సీత తన తేజసముతో రక్షింపబడెనేమో. ఆ కల్యాణి దహింపబడదు. అగ్ని అగ్నిని దహించలేదు కదా. ధర్మాత్ముడు, అమిత తేజసము కలవాడు అగు వాని భార్యను, తన పాతివ్రత్యముచే రక్షింపబడు ఆమెను, దహించుటకు పావకుడు అర్హుడుకాడు. సర్వము దహించు ఈ హవ్యవాహనుడు నన్ను దహించలేదు. అది తప్పక రామప్రభావము వలనే. వైదేహి సుకృతము వలననే. లక్ష్మణ భరతశతృఘ్నులకు దేవత అయినట్టి రామునికి ప్రియమైన సీత ఎట్లు దహింపబడును? సమస్త దహనకర్మలకు ప్రభువు , నాశనము లేని వాడు అగు ఈ అగ్ని, నా తోకను కాల్చనిచో ఈ ఆర్యురాలగు సీతను ఎట్లు దహించును ?'

అప్పుడు విస్మయుడైన హనుమంతుడు సాగరమధ్యములో బంగారు శిఖరములు గల పర్వత దర్శనమును మరల గుర్తు చేసుకొనెను. 'తన తపస్సుచేత, భర్త తప్ప వేరొక భావనలేని, అగ్నినే దహించకల శక్తి కల ఆమెను, ఆ అగ్ని దహించదు అని అనుకొనెను.

అప్పుడు అలాగ ఆ దేవి యొక్క ధర్మాచరణమును గురించి అలోచనలో ఉన్న హనుమంతుడు, చారణులవాక్యములను వినెను. 'రాక్షస భనములలో దుస్సహము భయంకరము అయిన అగ్నిని రగిల్చి హనుమ దుష్కరమైన కార్యమును సాధించెను. అహో ఎంత ఆశ్చర్యము. అటూ ఇటూ పరుగెడుతున్న రాక్షసులతో బాలురు స్త్రీలు వృద్ధులతో కూడిన జనకోలాహముల ఆక్రందనలు పర్వత గుహలలో లాగ ప్రతిధ్వనిస్తున్నాయి. ఈ నగరము ప్రాకార తోరణములతో సహా దగ్ధమైనది. కాని జానకి దగ్ధముకాలేదు. ఇది ఎంత ఆశ్చర్యకరము. అద్భుతము' అని.

ఆ హనుమంతుడు కనపడిన శుభసూచనలతో, రాముని మహాగుణములతో, జరిగిన కార్యములతో, చారణుల వాక్యములతో ప్రీతిచెందిన మనస్సు కలవాడయ్యెను.

అప్పుడు ఆ వానరుడు, సాధించిన మనోరథము కలవాడై, ఆ రాజకన్య క్షేమముగా వున్నదని తెలిసికొని, ఆమెను ప్రత్యక్షముగా చూచి తిరుగు ప్రయాణము చేయుటకు నిశ్చయించుకొనెను.

ఈ విధముగా అదికావ్యమైన శ్రీమద్రామాయణములో సుందరకాండలో ఏబది ఐదవ సర్గ సమాప్తము.

||ఓమ్ తత్ సత్||
శ్లో|| తతః కపిః ప్రాప్త మనోరథార్థః
తామక్షతాం రాజసుతాం విదిత్వా|
ప్రత్యక్షతః తాం పునరేవ దృష్ట్వా
ప్రతిప్రయాణాయ మతిం చకార||35||
స|| తతః కపిః ప్రాప్తమనోరథార్థః తాం రాజసుతాం అక్షతాం విదిత్వా తాం పునరేవ ప్రత్యక్షతః దృష్ట్వా ప్రతిప్రయాణాయ మతిం చకార||
తా||అప్పుడు ఆ వానరుడు పొందిన మనోరథము కలవాడై ఆ రాజకన్య క్షేమముగా వున్నదని తెలిసికొని , ఆమెను ప్రత్యక్షముగా చూచి తిరుగు ప్రయాణము చేయుటకు నిశ్చయించుకొనెను.
||ఓమ్ తత్ సత్||